ఇది నా మాటకు స్వాగతం

ఇది... నా మాట..! నా మనసులోని మాట..!

Tuesday, 17 May 2011

ఓ సామన్యుని కథ..2

మా అమ్మమ్మకు ముగ్గరు కూతుళ్లు...
మా అమ్మమ్మ యమునాబాయికి ముగ్గరు కూతుళ్లు పెద్దమ్మాయి పేరు సుశీల, రెండో అమ్మాయి పేరు అనసూయ, చిన్నమ్మాయి పేరు సద్గుణ. ESI ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మా అమ్మమ్మకు కాస్త ఆత్మస్థైర్యం పెరిగింది. తలమీద కూరగాయల గంప భారం కూడా తప్పడంతో ముగ్గురు అమ్మాయిల ఆలన పాలనపై దృష్టి సారించింది. అలారోజులు గడిచాయి. ఆడపిల్లల తల్లికదా వాళ్లు పెళ్ళీడుకొచ్చారు. పెద్దమ్మాయి సుశీలకు కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ మిల్లులో పనిచేసే లింగూసాకిచ్చి పెళ్లిచేసింది మా అమ్మమ్మ. కొద్దిరోజుల తరువాత ఆ సర్‌సిల్‌ మూతపడే అవకాశాలున్నాయని తెలుసుకున్న మా పెదనాన్న రిజైన్‌ చేశాడు. ఆ తరువాత ఆరు నెలలకే దాన్ని మూసేశారు. ఆ తరువాత ఆయన కుటుంబాన్ని నిజామాద్‌ జిల్లా బాల్కొండకు మార్చాడు. ప్రస్తుతం మా పెద్దనాన్న లింగూసా ఈ మధ్యనే కాలం చేశారు. ప్రస్తుతం మా పెద్దమ్మ సుశీల ఆర్మూర్‌లోని సొంతింట్లో ఉంటోంది.‌ ఇక రెండో అమ్మాయి అనసూయకు జగదీశ్వర్‌కిచ్చి వివాహం చేశారు. ఆయన టైలర్‌. పెళ్లి తరువాత ఆయన  కాగజ్‌నగర్‌లోనే టైలర్‌షాపు పెట్టుకుని మా అమ్మమ్మతో కలిసి ఉండేవాడు. ఇప్పటికీ అదే ఊళ్లో ఉంటున్నారు. కానీ టైలర్‌ షాపు తీసేశారు. ఆ తరువాత చిన్నమ్మాయి మా సద్గుణ (మా అమ్మ)ను దత్తాద్రి కిచ్చి పెళ్లి జరిపించారు. 
నేను పుట్టింది కాగజ్‌నగర్‌లోనే అయినా... 
మా నాన వాళ్లు అదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఉండేవారు. మా నాన్న దత్తాద్రి అప్పట్లో లారీ క్లీనర్‌గా పనిచేవారు. తరువాత సింగరేణి కాలరీలస్‌లో డ్రైవర్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం కరీంనగర్‌జిల్లా కమాన్‌పూర్‌ మండలం సెంటినరి కాలనీలో ఉంటున్నారు.  సింగరేణికాలరీస్‌ కంపెనీ OCP 2లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అంతకు ముందు బెల్లంపల్లిలో ఉండేవాల్లం. ఎందుకంటే ఉద్యోగరిత్యా మానాన్నకు మందమర్రి నుంచి ట్రాన్‌ఫర్‌ కావడంతో అక్కడకి మకాం మార్చాము. నేను పుట్టింది కాగజ్‌నగర్‌లోనే అయినా మందమర్రే మా సొంతూరన్నమాట. మందమర్రిలోని థర్డ్‌జూన్‌లో చిన్నగుడిసెలో ఉండేవాళ్లం. ఆ ఊర్లోని చెరువుకట్ట బడిలో నా అక్షరాభ్యాసం ప్రారంభమైంది. అదే స్కూల్లో మా అమ్మ కూడా టీచర్‌గా పనిచేసేది. మా అమ్మ అప్పట్లోనే పదో తరగతి చదివిందండోయ్‌..! ఆర్థిక ఇబ్బందుల కారణంగా మా అమ్మమ్మ కు చదివించే స్థోమత లేక తొందరగానే పెళ్లి చేసిందట. అప్పడప్పుడు ఈ విషయాన్ని మాఅమ్మ ఇప్పటికీ చెబుంతుంది. 
మా తాతకు నలుగురు భార్యలు....
నా గురించి చెప్పుకునే ముందు మానాన్న గురించి... మా తాతయ్య గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఓడలు బళ్లవుతాయ్‌... బళ్లు ఓడలవుతాయ్‌ అన్న నానుడికి ప్రత్యక్ష నిదర్శనం మా తాతయ్య కుటుంబమే ఉదాహరణ. మా తాగారి పేరు గుజరాతి రామన్న. వరంగల్‌లోని పాపయ్యపేట్‌ చమన్‌  కాకతీయ టాకీస్‌ సమీపంలోని మట్టెవాడ బొడ్రాయి  దగ్గరె వాళ్ల ఇళ్లు. మా తాతయ్య వాళ్లు ఇద్దరు మొత్తం ఇద్దరు సంతానం. పెద్ద రామన్న, చిన్న రామన్న. చిన్న రామన్న మాతాతయ్య. వీరద్దరు వ్యాపార్తులే. మా తాతయ్య చిన్న రామన్న ఊరూరా తిరిగి పట్టు వస్త్రాలు అమ్మేవాడు. అలా కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని బేతిగల్‌లో మకాం పెట్టాడు. పెద్ద రామన్న వరంల్‌లోనే పట్టువస్త్రాలు అమ్ముకుంటూ ఉండేవాడు. వ్యాపారంలో వచ్చిన లాభాలతో చిన్న రామన్న బేతిగల్‌లో వ్యవసాయ భూములు కొనడం... పనివాళ్లతో వ్యవసాయం చేయించడం చేస్తుండేవాడు. తరువాత తరువాత  పెద్ద భూసామిగా మారాడు. అప్పట్లో మాతాత గారికి 250 నుంచి 3 వందల ఎకరాల వ్యవసాయ భూములుండేవని మానానమ్మ చెప్పేది. మా తాతకు నలుగురు భార్యలు పెద్దావిడ చనిపోవడంతో రెండో ఆవిడను రెండో ఆవిడ చనిపోవడంతో మూడోఆవిడను చేసుకున్నాడట. మూడో ఆవిడ చెల్లెలు మీద మనసుపడ్డ తాతగారు ఆమెను దొంగతనంగా పెళ్లి చేసుకున్నారట. ఆ నాలుగో ఆవిడే మా నానమ్మ శారదాబాయి. మూడో ఆవిడ పేరు జానమ్మ. ఇద్దరి సొంతూరు మద్రాస్‌. అదే ఇప్పటి చెన్నై.

Sunday, 15 May 2011

...ఓ సామాన్యుని జీవితం...

                                            
 నేను  చాలా రోజుల నుంచి ఓ కథ (కల్పితం కాదు) రాయాలనుకుంటున్నాను.. ఎవరి కథ రాయాలి.. ఎలా రాయాలి అని అనుకుంటుండేవాన్ని. ఓ రోజు ఆఫీస్‌కు వచ్చిన తరువాత బ్రేక్‌లో నా గరువు సమానుడైన ఎం.వి.చక్రధర్‌ అన్నయ్యకి ఈ విషయం చెప్పాను. ఒరే పిచ్చోడా ఎవరిదో... ఏదో ఊహించుకుని రాసే కంటే ... నీ చిన్న నాటి సంగతులు... మీ కుటుంబం గురించి రాసెయ్‌ అన్నారు. ఎలా మొదలు పెట్టాలి... నాకు కనీస అవగాహన కూడా లేదే..? అన్న నా ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం ఏమిటంటే.. ప్రజలకు అర్థమయ్యే భాష రాయగలిగే పరిజ్ఞానం ఉంటే చాలని చెప్పారు. ఆ సలహానే ...ఓ సామాన్యుని జీవితం కు పునాది  రాళ్లయ్యాయి. నాలో చాన్నాళ్లుగా దాగిఉన్న రాయాలనే నా కోరికకు బలాన్నిచ్చాయి.... 

ఓ రోజు నా మిత్రుడు... సహోద్యోగి గంగాధర్‌ వీర్ల   తన  బ్లాగ్‌ చూస్తున్నప్పుడు నేనుకూడా బ్లాగ్‌ క్రియేట్‌ చేయాలనుకుంటున్నానని చెప్పాను. అతని సహకారంతో ఇది... నా మాట... బ్లాగ్‌ ను క్రియేట్‌ చేశాను.     నేను ఎన్నో రోజులుగా అనుకుంటున్న కథ రాసే కార్యక్రమానికి నా బ్లాగ్‌ వేదిక కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది..


ఈ రోజు నుంచి నా గరించి... నా గతం గురించి... నా కుటుంబం గురించి రాయాలని నిశ్చయించుకున్నాను. ఇది ఓ సామాన్య... మధ్య తరగతికి చెందిన నా గురించి... నా కుటుంబం గురించి. నేను రాసే ఈ కథలో మీ కుటుంబానికి చెందిన... మీ గతానికి చెందిన కొన్ని సందర్భాలు కనిపించవచ్చు... అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే నాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.


Add caption

ముందుగా మా అమ్మమ్మ గురించి... ఎందుకంటే...     
                                   

నేను పుట్టింది ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో. అక్కడ ESI ఆసుపత్రిలో నేను పుట్టాను. మా అమ్మమ్మ వాల్లఊరు అదే కాబట్టి. మా అమ్మమ్మ యమునాబాయి అదే హాస్పిటల్‌లో స్వీపర్‌గా పనిచేస్తుండేది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి.  మా అమ్మమ్మవాళ్ల అత్తగారు వరంగల్‌ జిల్లా చింతగట్టు. ఆమెకు ముగ్గరు ఆడపిల్లలు. ఆ తరువాత మా తాతగారు కాలం చేశారు. అత్తగారింట్లో చీదరింపులు... సూటిపోటిమాటలు... అవమానాలు భరించలేక అక్కడినుంచి పొట్ట చేతబట్టుకొని కాగజ్‌నగర్‌కు వచ్చింది. మగదిక్కు లేని కుటుంబం... కాబట్టి స్థానికంగా ఉన్న (నర్సింగ్‌ పవార్‌) మా పెదనాన్న అప్పుడప్పుడు ఆర్థికంగా ఆదుకునే వాడు. ఆయనకు కాగజ్‌నగర్‌లో భవాని బ్రాందీషాపు ఉండేది. సానుభూతి కంటే... స్వయంకృషే మేలు అని అనుకున్న మా అమ్మమ్మ కూరగాయల వ్యాపారం చేయలాని నిర్ణయించుకుంది. వ్యాపారానికి మా పెదనాన్న ఆర్థిక సహాయం కూడా చేశాడని చాలా సందర్భాల్లో మా అమ్మమ్మ చెబుతుండేది. తలమీద గంపను పెట్టుకుని ఊరంతా తిరిగుతూ కూరగాయాలు అమ్మి కుటుంబాన్ని ఈడ్చుకొచ్చింది మా అమ్మమ్మ. కొన్నేళ్ల తరువాత మా పెద్దనాన్న సలహా మేరకు ESI హాస్పిటల్‌లో స్వీపర్‌గా చేరింది. దీంతో మా అమ్మమ్మకు తలమీధ (కూరగాయల గంప) భారం నుంచి విముక్తి లభించింది. ఆసుపత్రిలో స్వీపర్‌గా చేరిన తొలినాళ్లలో ఆవిడ జీతం ఎంతో తెలుసా... కేవలం 30రూపాయలేనట.
  • ఇంతకీ ముగ్గురు కూతుళ్ల వివరాలు...
  • కాగజ్‌నగర్‌లో మా అమ్మమ్మ ఎక్కడుండేది...
ఆ వివరాలు... మీతో రేపు పంచుకుంటాను...
                                                                    ....మీ
                                                                    రాజ్‌కుమార్‌ ఖత్రి